వీక్లీ ఆఫ్ లేదు.. టైంకు జీతం రాదు.. ఇదీ తెలంగాణలో పోలీసుల పరిస్థితి!

by Disha Web Desk 19 |
వీక్లీ ఆఫ్ లేదు.. టైంకు జీతం రాదు.. ఇదీ తెలంగాణలో పోలీసుల పరిస్థితి!
X

తెలంగాణ పోలీస్​ అంటే.. ఇన్నోవా కార్లు, అద్దాల్లాంటి స్టేషన్లు, కంప్యూటర్లు, కమాండ్​కంట్రోల్​సెంటర్​ఇలా ఎన్నో కండ్లముందు కదలాడుతాయి. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసుల తరహాలో తెలంగాణ హోమ్ డిపార్టుమెంట్ ఉంటుందని ఘనంగా ప్రకటించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​అంటూ ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నా.. నాణేనికి మరోవైపులా రాష్ట్రంలో లాకప్‌డెత్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ సీసీటీవీలు ఉన్న నగరంగా ప్రపంచస్థాయిలోనే గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో సగం పనిచేయడమే లేదని స్వయంగా పోలీసులే వెల్లడించారు. ముఖ్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధుల సేవకులుగా, ఖాకీ యూనిఫాం వేసుకున్న గులాబీ సైనికులనే అపవాదును పోలీసు డిపార్టుమెంట్ మూడగట్టుకున్నది.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విజువల్ పోలీసింగ్ సిస్టమ్‌లో వంద శాతం ఫలితాలు సాధించినట్లు ఇటీవల రిటైరైన డీజీపీ మహేందర్​రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందిన ఏడు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటున్నట్టు తెలిపారు. కానీ, వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నం. ఈ ఏడాది జనవరి 24న జియాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య ఇందుకు నిదర్శనం.

ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో సాయినాథ్‌ను చిన్ననాటి స్నేహితులు పట్టపగలే జియాగూడ బైపాస్​రోడ్ దగ్గర కత్తులతో పొడిచి చంపేశారు. అక్కడ కానిస్టేబుల్ సహా వందలమంది ఉన్నా హంతకులు ముగ్గురూ తాపీగా తప్పించుకున్నారు. బజార్ ఘాట్ రోడ్డులో సైతం ఫిరోజ్ అనే రౌడీషీటర్ను ప్రత్యర్థులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. ఇలాంటివెన్నో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్‌ వాస్తవ పరిస్థితులకు ఉదాహరణలు.

నిద్రపోతున్న మూడో కన్ను..

దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు మన రాష్ర్టంలోనే ఉన్నాయని హోం మంత్రి మహమూద్ అలీ, ఇటు పోలీసు ఉన్నతాధికారులు తరచూ గర్వంగా చెప్తుంటారు. అందులో నిజం ఉన్నా.. పూర్తి వాస్తవం కాదు. పోలీసు రికార్డుల ప్రకారం రాష్ర్టంలో 10 లక్షల 25వేల 849 సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే, వీటిలో కనీసం 35% నుంచి 40% సీసీ కెమెరాలు పని చేయవు. ఉమ్మడి రాష్ర్టంలో రూ. 4,500 కోట్లుగా ఉన్న హోంశాఖ బడ్జెట్ ప్రస్తుతం రూ. 9,500 కోట్లకు పెరిగినా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంలేదు.

మహిళల భద్రత

మహిళ భద్రతకు అత్యంత ప్రాధాన్యతం ఇస్తున్నామని.. ఇందులో భాగంగానే షీ టీమ్స్​ఏర్పాటు చేశామని ప్రభుత్వం పేర్కొంటున్నది. అయితే, మహిళలపై జరుగుతున్న నేరాలు ఏమాత్రం తగ్గడంలేదు. ఒక్క 2022లోనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 17,908. వీటిలో 2,126 అత్యాచారాలు, 40 వరకట్న హత్యలు, 126 వరకట్న మరణాలు, 9,071 వరకట్న వేధింపులు, 181 హత్యలు, 4,964 మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులున్నాయి. ఈవ్​టీజింగ్​సంబంధించి 7,572 కేసులు నమోదయ్యాయి.

అమ్మో.. దొంగలు

ఏ సీనియర్ పోలీస్​అధికారిని ప్రశ్నించినా దోపిడీలు, దొంగతనాలు, చోరీలను నిరోధించటంతో పాటు ఆయా కేసుల్లో కనీసం 70 శాతం సొత్తును రికవరీ చేస్తేనే కరెక్ట్​పోలీసింగ్​అని చెబుతారు. అయితే, రాష్ర్టంలో ఏ రాత్రి ఏం జరుగుతుందోనన్న భయాందోళనల మధ్యనే జనం కాలం గడుపుతున్నారు. ఒక్క 2022లోనే బందిపోటు దోపిడీలు, దోపిడీలు, దొంగతనాలు, సాధారణ చోరీలు అన్నీ కలిసి రాష్ర్టం మొత్తం మీద 24,282 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సైబర్ ​నేరాలు

ప్రస్తుతం అన్నింటికన్నా ఆందోళన కలిగిస్తున్నవి సైబర్​నేరాలు. ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాం తదితర యాప్‌లను ఉపయోగించుకుంటున్న సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీడియో కాల్స్​రికార్డింగ్​చేసి.. మార్ఫింగ్​వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​చేస్తామని డబ్బు గుంజుతున్నారు. ఒక్క 2022లోనే ఈ తరహా నేరాలపై 13,895 కేసులు నమోదయ్యాయి. దానికి ముందు సంవత్సరం నమోదైన కేసుల సంఖ్య కేవలం 8,839 మాత్రమే. అంటే ఒక్క సంవత్సరంలోనే సైబర్​ నేరాల సంఖ్య 57 శాతం పెరిగిందన్న మాట.

కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏదీ?

ఉగ్రవాదుల ఆట కట్టించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్​వింగ్​ ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నది. ఈ సెల్ ప్రారంభంలో లా అండ్ ఆర్డర్ ఎస్సైలను ఎంపిక చేసినట్టుగా కాకుండా ప్రత్యేక అర్హతలు ఉన్నవారిని ఈ సెల్ కోసం ఎంపిక చేసి వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్పించుకున్నారు. ప్రారంభంలో ఈ సెల్ ఉగ్రవాదుల ఆట కట్టించటంలో మంచి ఫలితాలను కూడా సాధించింది. అయితే, ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులు ఈ సెల్‌లో పని చేస్తున్న వారిని పోలీస్​స్టేషన్లకు బదిలీ చేసి అక్కడున్న వారిని కౌంటర్ ఇంటెలిజెన్స్​వింగ్‌కు మార్చడంతో ఈ సెల్​ పడకేసింది.

పెరిగిపోతున్న డ్రగ్స్

విశ్వనగరంగా చెబుతున్న హైదరాబాద్‌లో డ్రగ్స్​వినియోగం గణనీయంగా పెరిగిపోతున్నది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల నుంచి టన్నుల్లో గంజాయి ఇక్కడకు వస్తుండగా గోవా నుంచి హెరాయిన్​తదితర సింథటిక్​ డ్రగ్స్ అడ్డూ అదుపు లేకుండా వచ్చి చేరుతున్నాయి. ఆఫ్రికన్​దేశాలకు చెందిన పలువురు వీటిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే ఈ విధంగా డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ 12మంది ఆఫ్రికన్ దేశస్తులను వారి వారి దేశాలకు పంపించేయడం గమనార్హం. అయితే, మాదక ద్రవ్యాల దందా చేస్తూ దొరికిన వారి కంటే దొరకని వారి సంఖ్య పదింతలు ఉంటుందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి.

భయపెడుతున్న లాకప్ ​డెత్‌లు

ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే మరోవైపు విచారణ పేర అనుమానితులను చిత్రహింసలు పెడుతున్నారు మన పోలీసులు. ఈ క్రమంలో కొందరి ప్రాణాలు కూడా పోయాయి. దీనికి నిదర్శనంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్​స్టేషన్​లో జరిగిన మరియమ్మ లాకప్​డెత్​ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఈ విషాదాన్ని మరిచిపోక ముందే ఫిబ్రవరిలో మెదక్ టౌన్ పోలీసులు ఓ దొంగతనం కేసులో ఖదీర్​ఖాన్​అనే వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

సెల్​ఫోన్​చోరీ కేసులో ఎల్బీనగర్ నివాసి చిరంజీవిని పోలీస్​స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో ఇంటరాగేషన్​ చేసి అతని ప్రాణాలను బలి తీసుకోవటం రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సిట్​రాష్ట్రంలో విశ్వసనీయత కోల్పోయింది. ముఖ్యమైన కేసుల విచారణకు ఏర్పాటు చేసే ఈ సెల్ అనేకానేక ప్రలోభాలకు లోనవుతున్నదని.. పారదర్శక దర్యాప్తు చేయడంలేదని విమర్శలు ఉన్నాయి. ఇందుకు టాలీవుడ్​ప్రముఖులకు డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న కేసును ఉదాహరణగా చెప్పవచ్చు.

అమలుకాని హామీలు

పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్, ఎనిమిది గంటల డ్యూటీ విధానాన్ని అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. హోంగార్డులను పర్మినెంట్ చేసే హామీ కూడా ఏండ్లు గడుస్తున్నా నెరవేరలేదు. పోలీసుల ఆరోగ్య అవసరాలకు ప్రత్యేకంగా ‘ఆరోగ్య భద్రత’ స్కీమ్ తెచ్చినా దానికి సర్కారు నుంచి నిధులు విడుదల కావడంలేదు. ఫలితంగా వారికి అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. నెల జీతాలు కూడా ఎప్పుడు పడతాయో? కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

శాంతిభద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్​ నియంత్రణలో తమదైన పాత్రను పోషిస్తున్న హోంగార్డుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం నడిచిన సమయంలో పలుమార్లు కేసీఆర్​ తాము అధికారంలోకి రాగానే హోంగార్డుల ఉద్యోగాలను పర్మినెంట్​ చేస్తామని పలు వేదికలపై ప్రకటించారు. రాష్ర్టం ఏర్పడి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఇదే విషయాన్ని ప్రకటించారు. అయితే, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి తప్పితే హోంగార్డుల ఉద్యోగాలు మాత్రం పర్మినెంట్​ కావటం లేదు.

ఆరోగ్య భద్రత ఎక్కడ..?

ఇక, సిబ్బంది సంక్షేమార్థం ప్రవేశపెట్టిన ఆరోగ్య భద్రత అటకెక్కింది. ఈ పథకం కింద పోలీసుశాఖలో పని చేస్తున్న సిబ్బంది అనారోగ్యానికి గురైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స జరిపించుకోవచ్చు. చికిత్సకు అయిన బిల్లులను ప్రభుత్వం ఆయా ఆస్పత్రులకు రీయింబర్స్ చేస్తుంది. అయితే, దాదాపు ఏడాదిగా ఆరోగ్య భద్రత స్కీంలో ఉండి వైద్య సేవలు అందించిన హాస్పిటళ్లకు ప్రభుత్వం రీయింబర్స్​చేయడంలేదు. దాంతో ఆయా ఆస్పత్రులు పోలీసు సిబ్బందికి వైద్యం చేయటానికి నిరాకరిస్తున్నాయి. దీంతో సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.

నాలుగేళ్లలో జరిగిన నేరాలు

క్రైమ్​ 2019 2020 2021 2022

హత్యలు 722 660 871 762

బందిపోటు దోపిడీలు 42 39 46 30

దోపిడీలు 456 305 464 495

దొంగతనాలు 4230 3426 4581 4421

చోరీలు 10689 8330 18277 19136

కిడ్నాపులు 1205 1‌‌033 2551 2126

లైంగికదాడులు 1721 1887 2577 2126

వరకట్న హత్యలు 43 42 40 44

సైబర్​ నేరాలు 6872 7045 8839 13895


Next Story

Most Viewed